📍 Locations
F T W

Harish Rao VS Revanth Government : అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా కడిగేస్తాం.. హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

Category: Breaking News | 05 Aug 2025

హైదరాబాద్ ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ నివేదికపై (Kaleshwaram Commission Report) మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బ్రీఫింగ్ చేశారు. జిల్లాల్లో హరీష్‌రావు ప్రెజెంటేషన్ చూసేలా బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాప్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రమే కేసీఆర్ నిర్వర్తించారని... రాజకీయ జోక్యం ఎలా అవుతుందని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌ను హింసించాలనే ధోరణి తప్ప.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

దేశంలో చాలా కమిషన్లు న్యాయస్థానాల ముందు నిలబడలేదని చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబుపై కూడా కమిషన్లు వేశారని.. అవి నిలబడలేదని గుర్తుచేశారు. సర్ ఆర్థర్ కాటన్ మాదిరిగా.. కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని కీర్తించారు. తెలంగాణలో కమీషన్ల ప్రభుత్వం నడుస్తోందని ఆక్షేపించారు. 650పేజీల రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. కాళేశ్వరం నివేదికలో నచ్చిన పేరాలను లీక్ చేశారని... నచ్చని నాయకులను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు.